● మూడురోజుల పాటు నిర్వహణ
● రంగురంగుల విద్యుద్ధీపాలు.. పచ్చటి తోరణాలతో ముస్తాబైన ఆలయం
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో 355వ ఆరాధనోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్థానిక రాఘవేంద్ర సేవాసమితి ఆధ్వర్యంలో మూడురోజుల పాటు పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్ధీపాలు, పచ్చటి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 29న శనివారం పూర్వారాధన రోజున ప్రత్యేక పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 30న ఆదివారం మధ్యారాధన సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు ప్రముఖ పండితుల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. 31న సోమవారం ఉత్తరారాధన రోజున ప్రత్యేక పూజలు, పల్లకీసేవ, భజన కార్యక్రమాలు నిర్వహించి ముగింపు పలకనున్నారు. ఆరాధనోత్సవాల అనంతరం సెప్టెంబర్ 1న మంగళవారం శ్రావణ బహుళ పంచమి సందర్భంగా షోడశబాహు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారి 103వ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


