నర్వ: రూ.కోట్ల నిధులతో నర్వ మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి తీరుతామని.. మంత్రిగా ఉన్నా ఎల్లప్పుడు మీ సేవకుడినేనని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.55 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు పీఏసీఎస్లో రూ.22 లక్షల రైతుల రవాణా చార్జీల పంపిణీ, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా యాస్పిరేషన్బ్లాక్గా నర్వ ఎంపికై తే కొందరు బాణాసంచ కాల్చి సంబురాలు చేసుకోవడం అత్యంత దౌర్భాగ్యమన్నారు. విద్యాపరంగా అభివృద్ధి చేద్దామని నవోదయ విద్యాలయ ఏర్పాటుకు ఎంపీని కోరితే రాజకీయం చేశారని ఆరోపించారు. వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగుచేయాలని పని చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రహదారి, అంతర్గత రహదారులను సీసీగా మార్చడం, విద్య, వైద్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించామని వివరించారు. జంగంరెడ్డిపల్లి లిఫ్ట్తో సాగునీటి కష్టాలు తీర్చేలా ముందుకు సాగుతున్నామన్నారు. ఇటీవల చంద్రఘడ్, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల మరమ్మతు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మన్న, సర్పంచ్ హన్మంత్రెడ్డి, నాయకులు పోలీస్ జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వివేక్వర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


