జిల్లా నుంచే సంక్షేమ పథకాల అమలు
● మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
● ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట/కోస్గి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన సంక్షేమ పథకాల అమలుకు జిల్లా నుంచే శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయం, కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా మొదటి పెట్రోల్ బంక్ను జిల్లాలోనే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. కోస్గిలోనూ పెట్రోల్బంక్ కావాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారని చెప్పారు. ఒక పెట్రోల్ బంక్ మాత్రమే కాకుండా ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్, రైస్ మిల్లులు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవసరమైన రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలిని ఆర్థికంగా శక్తివంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను కలెక్టర్ పంపిణీ చేశారు. కోస్గిలో 187 మహిళా సంఘాలకు రూ. 65,76,674 వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. నారాయణపేట మున్సిపాలిటీలోని మహిళా సంఘాలకు రూ. 1.41కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు తెలిపారు. 7వేల ఇందిరమ్మ చీరలు వచ్చాయని.. వాటిని వెంటనే అర్హులందరికీ పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్యను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ. 35లక్షలతో నిర్మించిన మహిళా సంఘాల మీటింగ్ హాల్ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కడా కమిషనర్ వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం శివకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్కుమార్, ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేశ్, మున్సిపల్ కమిషనర్లు నర్సయ్య, నాగరాజు, మేనేజర్ అజీమ్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, నరేందర్, మాస్టర్ శ్రీనివాస్, బాలేష్, శ్రీనివాస్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
కొత్తగా ఎన్నికై న సర్పంచులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు 2018 పంచాయతీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. అదే విధంగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాలను వివరిస్తారన్నా రు. శిక్షణ తరగతుల్లో చెప్పే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. పంచాయ తీ కార్యదర్శుల విధులు, అనుమతులు, ఉపాధి హామీ పథకం కింద ఏ పనులు చేపట్టాలనే విషయా లను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. కాగా, శిక్షణలో పోలీసు, వ్యవసాయ, ఉద్యాన, విద్య, హౌసింగ్ కార్పొరేషన్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీపీఓ సుధాకర్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కాగా, మొదటి బ్యాచ్ శిక్షణకు దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, గుండుమల్, మద్దూరు మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


