పత్తి రైతుకు ఊరట
నారాయణపేట
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
మద్దతు ధర క్వింటాకు రూ.589 పెంచిన కేంద్రం
● తక్కువగా వరికి రూ.69..
● ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 1.80 లక్షల ఎకరాలు
● ధర పెంపుతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
● నిరాశలో వరి రైతులు
మరికల్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పండించే పంటలకు మద్దతు ధరలు ఖరారు చేసింది. అందులో అత్యధికంగా పత్తి క్వింటాకు రూ.589 పెంచడంతో సాగు రైతులకు ఊరట లభించింది. జిల్లాలో వానాకాలం రైతులు అధికంగా పత్తి సాగు చేస్తారు. కేంద్రం మద్దతు ధర పెంచడంతో వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ.7,521 ధర ఉండగా.. రూ.589 పెంపుతో ఈ ఏడాది ధర రూ.8,110గా నిర్ణయించింది. పత్తి తర్వాత సోయాకు రూ.436 పెరగగా గతేడాది ధర రూ.4,892 ఉండగా.. ఈసారి రూ.5,328 కానుంది. వరి ధాన్యంపై కేవలం రూ.69 మాత్రమే పెరిగింది. వ్యవసాయమే ఆధారం.. అందులోనూ పత్తి సాగే ప్రధానంగా ఉన్న జిల్లాకు ధరల పెరుగుదల కాస్త కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ యంత్రాల ధరలతో పోలిస్తే మద్దతు ధరలు మరింత పెరిగితే బాగుండేదన్న భావన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది పత్తి 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనా.
రైతుల చూపు.. పత్తి వైపు...
పత్తికి మద్దతు ధర అధికంగా పెంచడం, సీసీఎస్ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటంతో చాలామంది రైతులు పత్తి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో పత్తిని కర్ణాటకకు తీసుకెళ్లి విక్రయించే వారు. ప్రస్తుతం జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, నారాయణపేట మండలాల్లో జిన్నింగ్ మిల్లులు ఉండటం రైతులకు కొంత ఊరటనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో జిల్లాలో పత్తి తర్వాత రెండో స్థానంలో వరి నిలిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.589 పెంచి.. వరికి మాత్రం కేవలం రూ.69 పెరగడంతో వరి సాగు రైతులు నిరాశలో ఉన్నారు.
పత్తి రైతుకు ఊరట


