కర్నూలు (టౌన్): ఓటరు జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకుని ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ పంపించి తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బ్యాంకు, కార్డు వివరాలు, ఓటీపీలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


