నందికొట్కూరు: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్లో అర్హత లేకపోయినా 2025 డీఎస్సీలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో మంత్రి లోకేశ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చిన సంఘటన డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో బయటపడిందని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లను వైఎస్సార్సీపీ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినా ఎందుకు ముందడుగు వేయలేదని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలను బయటకు తీసేందుకు సీబీఐకు అప్పగించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగి భృతి నెలకు రూ.3 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు అబ్దుల్లా, సతీష్రెడ్డి, శశాంక్, బన్నీ, చరణ్, మన్సూర్, రంగ, తదితరులు పాల్గొన్నారు.
– డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్


