కర్నూలు(టౌన్): ప్రజల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 2004 సంవత్సరం మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణ యుగాన్ని తలపించింది. 2009 సంవత్సరం ఏప్రిల్లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఆయన పాలనలో రూపుదిద్దుకున్న ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందించడం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మహానేత మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ చిరునవ్వు మదిమదిలో సజీవంగా ఉండటం విశేషం. ప్రతి ఏడాది ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజలు తమకు చేకూరిన లబ్ధిని గుర్తు చేసుకొని మనసులోనే నివాళులర్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులతో పాటు కర్నూలు నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని స్టేట్ బ్యాంకు వద్దనున్న వైఎస్సార్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అలాగే జిల్లాలో గురురాఘవేంద్ర, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, అవుకు రిజర్వాయర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఆయనకే సొంతం. ఈ నేపథ్యంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చి బుధవారం వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


