ఆళ్లగడ్డ: పట్టణ శివారు పాలసాగరం వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఆంజనేయులు (27)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నాయీ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆంజనేయులుకు ఐదేళ్ల క్రితం రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో వివాహం అయ్యింది. అతడు సోమవారం రాత్రి ఇంటి వద్ద ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణ శివారులోని పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న తోటలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి చూడగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. అతని భార్య సుబ్బులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. మృతదేహం పడిఉన్న చోట మద్యం బాటిల్లు ఉండటంతో మద్యం మత్తులో ఘర్షణ జరిగి హత్య చేశారా? లేక వివాహేతర సంబంధం కారణమా? ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు


