● వైభవంగా 6వ రోజు ఆరాధన వేడుకలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మంత్రాలయం: మంగళకర వాయిద్య నాదాలు.. భక్తజనుల జయజయ పఠనాలు.. పండితుల వేద ఘోషల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కొలువుదీరారు. పండితుల ఉయ్యాల జంపాలతో ఉత్సవమూర్తి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రహ్లాదరాయలకు అశ్వవాహన సేవ గావించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి చతుర్వేద పారాయణం గావిస్తూ ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం ప్రాంగణ వీధుల్లో అశ్వ వాహనంపై కనుల పండువగా ఊరేగింపు సాగింది. ఆనవాయితీలో భాగంగా చెక్క, వెండి, అంభారి, స్వర్ణ, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. 6వ రోజు వేడుకల్లో రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ చేపట్టారు. ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
ఆరాధన ఆఖరిరోజు సందర్భంగా సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఉత్సవం సందర్భంగా ఏకకాలంలో పంచవాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు.


