● నిండని తుంగభద్ర డ్యామ్ ● వెలవెలబోతున్న ఎల్లెల్సీ ● ప్రశ్నార్థకంగా మారిన వరి సాగు
హొళగుంద: వరి సాగుకు సిద్ధం కావాల్సిన పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. నారు మళ్లతో పచ్చగా కళకళలాడాల్సిన ప్రాంతాలు ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. పంట కాల్వలు నీరు లేక వెలవెలబోతున్నా యి. ఎల్లెల్సీ ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయిని అయిన తుంగభద్ర జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది ఇదే సమయానికి 27 వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదై 79 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఈ ఏడాది ఒక చుక్క నీరు కూడా ఇన్ఫ్లో లేక 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీ తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే దిగువ కాలువ (ఎల్లెల్సీ)నే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల దాటుతు న్నా, జూలై మొదటి వారంలో అడుగు పెట్టినా నేటికి టీబీ డ్యాంలో చుక్క నీరు చేరకపోవడంతో ఎల్లెల్సీ కింద వరి, ఇతర పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర జలాశయంలో ఆంధ్ర కోటాలో కర్నూలు జిల్లాకు దాదాపు 24 టీఎంసీల నీటిని కేటాయించారు. నీటి లభ్యత తగ్గడంతో 17 లేదా 18 టీఎంసీల వరకు కుదిస్తూ వస్తున్నటు్ల్ సమాచారం. ఆ నీటితో ఖరీఫ్లో 43,413, రబీలో 1.07 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితో పాటు దాదాపు 140 గ్రామాలకు తాగునీరు నీరందించాలి.
ఆగస్టు వరకే అవకాశం..
తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నెలలో వర్షాలు ప్రారంభమై వరద జలాలతో ఆగస్ట్ 15 నాటికి పూర్తిస్థాయిలో నిండిపోతుంది. అయితే ఈ ఏడాది జూలై నెల మొదలైనా చినుక జాడా లేక చుక్క ఇన్ఫ్లో లేదు. దీంతో మూడు రాష్ట్రాలకు సాగు, తాగునీటి గండం నెలకొంది. తుంగభద్ర జలాశయం 70 ఏళ్ల చరిత్రలో నీటి లభ్యత తగ్గిన దాఖలాలో ఈ ఏడాది కూడా చేరుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తుంగభద్ర జలాశయం పైభాగంలోని ఆగుంబే, వరనాడు, శివమొగ్గ, తీర్థనహళ్లీ, శృంగేరి తదితర ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టులు నిండిన తర్వాతే టీబీ జలాశాయానికి జలాలు చేరుతాయి. వానలు ఆలస్యం అయితే వర్షాకాలం ముగుస్తుంది. ఆగస్ట్ 15లోగా జలాశయం నిండితేనే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఏడాది గత ఏడాది కన్నా భిన్నమైన వాతావరణం కనబడుతుండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది.
తాగునీటికి ప్రమాద ఘంటికలు..
ప్రస్తుతం డ్యాంలో నిల్వ ఉన్న 9 టీఎంసీలు గత రబీకి విడుదల చేయకుండా నిల్వ చేశారు. అదే నీరు నేడు తాగునీటి అవసరాలకు వస్తున్నాయి. ఒకవేళ రబీలో నీరు వదిలి ఉంటే ఈ ఏడాది జలాశయం పూర్తి డెడ్ స్టోరేజ్లోకి చేరి ప్రమాద ఘంటికలు వినిపించేవి. అయినా వర్షాలు కురువక డ్యాంలో నీరే చేరకపోతే రాబోయే రోజుల్లో భారీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి కర్నూలు జిల్లా ప్రజలతో పాటు వైఎస్సార్ కడప, అనంతపురం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.


