నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫ్యాప్టో నంద్యాల జిల్లా ఇన్చార్జ్ హృదయరాజు, అధ్యక్షుడు రామచంద్రారెడ్డితో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. ఉపాధ్యాయ ఆర్థిక సమస్యలు పరిష్కారంలో కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 14వ తేదీన నంద్యాల కలెక్టరేట్ ముట్టడించనున్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో 12వ పీఆర్సీని సకాలంలో అమలు చేస్తామని, ఐఆర్ను ప్రకటిస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డీఏ చెల్లిస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని నమ్మంచి మోసం చేశారన్నారు. కూటమి సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకు 12వ వేతన సవరణ కమిషన్ నియమించలేదు, పెండింగ్ డీఏలు ఇవ్వలేదన్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారుపై నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేయనున్నామన్నారు. కార్యక్రమానికి ఫ్యాప్టో కో చైర్మన్లు, ప్రసాద్, చంద్రశేఖర్, స్వామిశేఖర్, శ్రీనివాసులు, శివయ్య, లక్ష్మీనాయక్, జాకీర్హుసేన్, సైఫుల్లా, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


