నేటి నుంచి ప్రారంభం
జిల్లాలో 130 పరీక్ష కేంద్రాలు
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
హాల్టికెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
నంద్యాల(న్యూటౌన్): జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక నంద్యాల ఎస్పీజీ, బాలికల ఉన్నత పాఠశాల, చాపిరేవుల జిల్లా పరిషత్ హైస్కూల్, ఎస్డీఆర్ తదితర పరీక్ష కేంద్రంలో పది పరీక్షల ఏర్పాట్లను ఆదివారం డీఈఓ జనార్ధన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. 130 పరీక్షా కేంద్రాల్లో 18,508 మంది రెగ్యులర్, 9,093 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఐదు పరీక్షా కేంద్రాల్లో 576 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పా టు చేశామన్నారు. సమస్యల పరిష్కారానికి డీఈఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నా రు. సమస్యలు ఉంటే 9000313871, 9515185150 నంబర్లను సంప్రదించాలన్నారు. ఆయన వెంట చీఫ్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు ఉన్నారు.
ముఖ్యమైన విషయాలు..
● ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9.30 గంటల వరకు పరీక్ష ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ముగిసే వరకు
విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు.
● గుర్తింపు కార్డు కలిగి పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు స్క్వాడ్ బృందాలను పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు.
● విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లను నియమించారు.
● ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
● జిల్లాలోని పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజ్ పాయింట్గా వెంకటేశ్వరపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్డీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోనే పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్ను ఏర్పాటు చేశారు.
● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు జిల్లా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో ఆదివారం పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్ష కేంద్రం అయినా చిన్న సంఘటన జరిగినా వెంట నే 100, 112కు సమాచారం అందించాలన్నారు.


