డ్రగ్స్ వినియోగంతో భవిష్యత్తు అంధకారం
కర్నూలు: డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు అంధకారమవుతుందని, వాటి జోలికి వెళ్లొద్దని నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా సూచించారు. ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎలీషా ఆధ్వర్యంలో శుక్రవారం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సీఐ విక్రమసింహ ముఖ్య అతిథిగా హాజరై మత్తు పదార్థాల వినియోగం వల్ల సంభవించే నష్టాలు, వాటికి అలవాటుపడిన వారు ఎలా బయటపడాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ‘సే నో టు డ్రగ్స్’ అని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను పంపిణీ చేశారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం గానీ, మహిళల భద్రతకు సంబంధించిన సమాచారం గానీ తెలిస్తే డయల్ 100, 112, 1930 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విక్రమసింహ విద్యార్థులకు సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి 1972కు సమాచారం అందించాలన్నారు.


