విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టేస్తుంది!
● విద్యుత్ కంచెల నుంచి రక్షణకు అటవీశాఖ వినియోగం
ఆత్మకూరురూరల్: అటవీ సమీప గ్రామాల్లోని రైతులు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు తమ పొలాలకు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తారు. కొన్ని సార్లు ఈ కంచెకు పెద్దపులిలాంటి ముఖ్య సంరక్షిత జంతువులు కూడా బలయ్యే అవకాశముండటంతో వాటిని అధికారులు నిషేధించారు. అయినప్పటికీ నల్లమల అటవీ సమీప గ్రామాల్లోని రైతులు కొందరు గుట్టుగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించి వాటిని తొలగించేందుకు అటవీ సిబ్బంది పొలాల్లో తచ్చాడుతుంటారు. ఈ క్రమంలో వెలుగోడు వెస్ట్ బీట్లో విద్యుత్ కంచె తగిలి లక్షణ నాయక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ ప్రసారాన్ని కొద్ది దూరం నుంచే గుర్తించి హెచ్చరించే ( లైవ్ వైర్ డిటెక్టర్) పరికరాన్ని అటవీశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో అటవీ రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఇలాంటి పరికరాలను నాలుగు చొప్పున కేటాయించారు. ఈ పరికరాన్ని మధ్యప్రదేశ్కు చెందిన ఒక అటవీ అధికారి తయారు చేసినట్టు తెలిసింది. ఈ పరికరం ద్వారా కరెంటు ప్రవాహమున్న తీగలు కంటికి కనిపించకున్నా కొన్ని అడుగుల ముందే గుర్తించవచ్చు. ఫుట్ పెట్రోలింగ్ చేసే సిబ్బందికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ పరికరాన్ని డీడీ విగ్నేష్ అపావ్ సోమవారం పరిశీలించి, ఆపరికరం పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు.
విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టేస్తుంది!


