రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల

Jan 12 2026 7:50 AM | Updated on Jan 12 2026 7:50 AM

రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల

రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మాత దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారి మహమ్మద్‌ ఆదివారం తెలిపారు. మార్కాపురం జిల్లా నెక్కంటి పరిధిలోని ఇష్టకామేశ్వరి మాత అమ్మవారి ఆలయ పరిసరాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు వాహనాలను నిలుపుదల చేసి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు గమనించి ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం వాయిదా వేసుకోవాలని సూచించారు.

31న ఎంపీపీపై అవిశ్వాసం

జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా మండల ఎంపీపీ సువర్ణమ్మపై ఈనెల 31వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు. ఎంపీటీసీ సభ్యులకు ఆత్మకూరు ఆర్డీఓ నాగ జ్యోతి నోటీసులు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన సువర్ణమ్మను ఎంపీపీ పీఠం నుంచి దించేందుకు మండలంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ మేరకు వినతిపత్రాన్ని పరిశీలించి అవిశ్వాస తీర్మానం సభ లో ప్రవేశపెట్టేందుకు ఈనెల 31వ తేదీని ఆర్డీఓ నిర్ణయించారు. 2021 ఏప్రిల్‌ 8న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా తాటిపాడు, పారుమంచాల గ్రామా ల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థులు ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా గెలువలేదు. 2024 ఎన్నికల అనంతరం కొంత మంది ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల్లో చేరారు. వారిలో ఆరుగురిని తమవైపు తిప్పుకొని ఎంపీపీ సువర్ణమ్మను పీఠం నుంచి దింపేందుకు యత్నించటం గమనార్హం.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 12వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

అటవీ శాఖలో డ్రోన్‌ పైలట్‌లు

శిక్షణకు ఆరుగురు అధికారుల ఎంపిక

ఆత్మకూరురూరల్‌: అటవీ సంరక్షణలో డ్రోన్‌ల వినియోగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్‌కు చెందిన ఆరుగురు అధికారులు డ్రోన్‌ పైలట్‌లుగా శిక్షణకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆత్మకూరు డివిజన్‌ ప్రాజెక్ట్‌ టైగర్‌ డీడీ విగ్నేష్‌ అపావ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డ్రోన్‌ అకాడమిలో శిక్షణ కోసం ఆరుగురు అధికారులను ఎంపిక చేసి పంపామని, వారు డ్రోన్‌ అకాడమి డైరెక్టర్‌ వద్ద ఆదివారం రిపోర్ట్‌ చేశారన్నారు. కెపాసిటి బిల్డింగ్‌లో భాగంగా డివిజన్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఓలు మహబూబ్‌ బాషా, రాజశేఖరరెడ్డి, ఎఫ్‌బీవోలు పీరా సయ్యద్‌, ఇస్మాయిల్‌, రజాక్‌ సాహెబ్‌, శ్రీనివాసులు శిక్షణ పొందడం కోసం వెళ్లారని వివరించారు.

57 రోజుకు చేరిన రిలే దీక్షలు

ఆదోని టౌన్‌: ఆదోని జిల్లాను సాధించుకునేంతవరకు ఐక్యంగా పోరాడుదామని జేఏసీ నాయకులు రఘురామయ్య, కుంకనూరు వీరేష్‌, దస్తగిరి నాయుడు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 57వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆదోని జిల్లా జేఏసీ నాయకులు కమతం వెంకటేష్‌, వై.వెంకోబ, సి.వీరేష్‌, నరేంద్రయాదవ్‌, కుమార్‌, రామలింగయ్య, వెంకటేష్‌, నరసింహా, మల్లికార్జున, అశోక్‌ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement