ఇది మోసం కాదా?
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
డోన్: అభివృద్ధి చేయకుండా అబద్ధాలు చెప్పడం సీఎం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఉడుములపాడు టీడీపీ కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో రూ. 5కోట్లతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల్లో మౌలిక వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో కళ్యాణ మండపాలు రెండేళ్ల కాలం పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు.
మంజూరైన వాటిని ఎందుకు రద్దుచేశారు?
డోన్ నియోజకవర్గానికి అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసినా వాటిని నేటి వరకు ఎందుకు ప్రారంభించలేదని మాజీ మంత్రి బుగ్గన నిలదీశారు. ఎస్సీ బాలుర కోసం ఓబులాపురం వద్ద మంజూరు చేసిన వసతి గృహ నిర్మాణం పనులతో పాటు బేతంచెర్ల పాలిటెక్నిక్ భవన నిర్మాణం పనుల టెండర్లు కూడా టీడీపీ నాయకుల స్వార్థం కోసం రద్దు చేశారన్నారు. రాష్ట్రానికే తలమానికమైన ఐటీడీఆర్ నిర్మాణం పూర్తయితే ఏటా వందలాది మంది నైపుణ్యం గల డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని, దానిని మరుగున పడవేశారన్నారు. జ్యోతిరావ్పూలే ఆశ్రమ పాఠశాలను ఎక్కడా లేనివిధంగా ఆధునిక హంగులతో నిర్మిస్తే అందులో వసతిగృహం, డార్మెంటరీ నిర్మాణం పనులు ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. చెరువులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆధునికీకరణ చేస్తే వాటిని నీటితో నింపలేదన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వాల్మీకి గుహలు, నగరవనంతో పాటు చెరువుల్లో బోటు షికారు కేంద్రాలను మంజూరు చేస్తే అవన్నీ శిథిలమయ్యేట్లు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైల్వే అండర్పాస్ ఏమైంది?
డోన్ పట్టణ నడిబొడ్డున నంద్యాల, కర్నూలు రైల్వేగేట్లు ఉన్నందున కేంద్ర రైల్వేశాఖ మంత్రి చొరవతో తాను రెండు అండర్పాస్ బ్రిడ్జిలను మంజూరు చేయించానన్నారు. అయితే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి వాటి పనులు జరగకుండా ఆపివేశారన్నారు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నాయకులకు దమ్ము ఉంటే ఈ అండర్ పాస్ బ్రిడ్జి పనులను చేసి చూపించాలని ఆయన సవాల్ చేశారు.
వాటర్గ్రిడ్ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం
గోరుకల్లు రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గ ప్రజలకు శుద్ధజలాన్ని అందించేందుకు వాటర్గ్రిడ్ పనులను రూ.210 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిందని బుగ్గన గుర్తు చేశారు. పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇందులో ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. రూ.40కోట్లతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించి డాక్టర్లను నియమిస్తే నేడు కనీసం ఆసుపత్రిలో ఫర్నిచర్ సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయిందని దుమ్మెత్తిపోశారు.
రాష్ట్రానికి నాలుగుసార్లు సీఎంగా ప్రాతినిథ్యం వహించానని చెప్పుకుంటున్న చంద్రబాబు అనేకమార్లు అధికారంలోకి రావడానికి ఆకర్షణీయమైన అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి విమర్శించారు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని, ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రచారం చేసి వైఎస్ఆర్సిపి బలోపేతానికి కార్యకర్తలందరూ పనిచేయాలని రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు అన్నారు. ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోసు్ట్రపసాద్, పార్టీ ఉపాధ్యక్షుడు కురుకుందు హరి, పార్టీ మండల అధ్యక్షుడు సోమేష్ యాదవ్, పార్టీ నాయకులు మల్యాల భాస్కర్ రెడ్డి, దినేష్గౌడ్, ఆర్ఈ రాజవర్దన్, మల్యాల శ్రీనివాసరెడ్డి, చంద్ర పాల్గొన్నారు.
ఇది మోసం కాదా?


