నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టుల భూ సేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్లో ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆయా ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలను త్వరితగతిన అందించేలా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ బృందం ద్వారా పునరావాస ప్యాకేజీలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఆర్డీ మాధవి, ఆర్డీఓలు, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


