నార్కట్పల్లి : చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అమావాస్య సందర్భంగా భక్తజనసందోహంతో పోటెత్తింది. మంగళవారం రాత్రి అమావాస్య కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు మంగళవారం సాయంత్రం నుంచే భారీగా కొండపైకి చేరుకున్నారు. అమావాస్య రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అత్యంత వైభవంగా లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొండపైకి వాహనాలు వెళ్లకుండా ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.


