నల్లగొండ టూటౌన్ : జూనోటిక్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్య పశుసంవర్థక అధికారి డాక్టర్ జివి.రమేష్ అన్నారు. జూనోటిక్ వ్యాధులపై నల్లగొండలోని బాలికల హాస్టల్లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక్క కరిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవాలన్నారు. జపనీస్ ఎన్సెఫలైటిస్, క్షయవ్యాధి, బ్రుసెల్లోసిస్, బద్దె పురుగుల ద్వారా వచ్చే వ్యాధులు, బర్డ్ ఫ్లూ, లెప్టోస్పైరోసిస్ వంటి జూనోటిక్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ రావిరాల మల్లికార్జున్, విజయలక్ష్మి, స్వప్న, దూసరి భారతమ్మ, వెంకటనర్సమ్మ పాల్గొన్నారు.
కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
దేవరకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి సూచించారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓటరు జాబితా పవిత్రతను కాపాడడమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టేనని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో కిసాన్మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, నాయకులు కేతావత్ లాలునాయక్, వనం నరేందర్రెడ్డి, విద్యాసాగర్రెడ్డి, అంకూరి నర్సింహ, బెజవాడ శేఖర్, నక్క వెంకటేష్, చెనమోని రాములు, వనం పుష్పలత, వినోద్ రాథోడ్,వనం సుజాత, వస్కుల సుధాకర్, నగేష్, ఆంజనేయులు, రామునాయక్ తదితరులున్నారు.
రేణుకా ఎల్లమ్మకు అభిషేక పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జ్వేష్టమాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో నిజ అభిషేక పూజలు జరిపారు. అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించారు. అమ్మవారికి శ్రీదేవి ఖడ్గమాల నామావళి విధానంతో కుంకుమార్చనలు నిర్వహించి సింహ హారతినిచ్చారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


