యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి శనివారం ఉదయం 11.37 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆలయ ముఖ మండపంలోని గర్భాలయ బంగారు వాకిలి చెంత చైర్మన్తో పాటు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పాలకమండలి సభ్యులకు ఘనంగా స్వాగ తం పలికేందుకు అధి కారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ మండపాన్ని విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దడంతో పాటు పూలతో అలంకరించారు. ఆలయ పరిసరాలు, తిరు, మాడ వీధులు పరిశుభ్రంగా కనిపించేలా తీర్చిదిద్దారు.
మొదట చైర్మన్తో..
వైటీడీ పాలకమండలి చైర్మన్గా మహబూబ్నగర్కు చెందిన ఎం. సత్యనారాయణరెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, విజయేందర్ తూళ్ల, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్రావు, లక్ష్మీనారాయణనాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులచే ఆలయ ఈఓ భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం చైర్మన్, సభ్యులంతా కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ తొలి సమావేశంలో పాల్గొననున్నారు.


