నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)తో పాటు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ) అమలు చేస్తూ కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 జనవరి 13 నుంచి ఈ సౌకర్యాలు అమల్లోకి రానున్నాయి. దీంతో అర్హులైన ఉద్యోగులకు ఆ తేదీ నుంచి రావాల్సిన హెచ్ఆర్ఏ, సీసీఏ బకాయిలను చెల్లించాలని ట్రెజరీ అధికారి, పే అండ్ అకౌంట్స్ అధికారి, అన్ని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు (డీడీఓలు) కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక వేతనంపై 13 శాతం హెచ్ఆర్ఏ లభించేది. కార్పొరేషన్గా మారడంతో అది 17 శాతానికి పెరిగింది. అర్హతల పరిశీలన అనంతరం బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ నిర్ణయంతో కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
ఫ 17 శాతం హెచ్ఆర్ఏ, సీసీఏ అమలు


