2024 ఏప్రిల్ నుంచి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో విద్యుత్ ప్రమాదాలతో మరణించిన అందరి కుటుంబాలకు పరిహారం అందడం లేదు. రెండేళ్లలో 69 మంది మరణిస్తే కేవలం 23 మంది కుటుంబాలకే పరిహారం అందింది. ఇంకా 46 కుటుంబాలకు పరిహారం అందలేదు. విద్యుదుఘాతంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలు బతుకు వెళ్లదీయడానికి నానా తంటాలు పడుతున్నాయి.
వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు
వర్షాకాలం ప్రారంభమైతే చాలు విద్యుత్ ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వర్షాలకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, లీకేజీలు ప్రమాదకరంగా మారుతుండడంతో ఏటా ప్రాణ, ఆస్తినష్టం చోటుచేసుకుంటోంది. ముఖ్యంగా జిల్లాలో చాలా చోట్ల కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లు, తుప్పుపట్టిన ఐరన్ పోల్స్, విద్యుత్ తీగలకు చెట్లు తాకడం వంటి కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
2024–25లో ప్రమాదాల తీవ్రత ఎక్కువ
2024–25 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 261 విద్యుత్ ప్రమాదాలు నమోదయ్యాయి. ఆ ఒక్క ఏడాదే 46 మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. అదే ఏడాది 211 జంతువులు బలయ్యా యి. వర్షాకాలంలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగి నట్టు విద్యుత్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025–26లో కాస్త తక్కువే..
గతేడాది విద్యుత్ ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2025–26లో 155 ప్రమాదాలు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. జంతు మరణాలు 126గా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే గత ఏడాది విద్యుత్ ప్రమాదాలు, మానవ మరణాలు కొంత తగ్గినా, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పక్కా భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన తీగలు, వ్యవసాయ మోటార్ల సమీపంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రూ.1.24 కోట్ల ఎక్స్గ్రేషియా
విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు, జంతు యజమానులకు విద్యుత్ సంస్థ ఎక్స్గ్రేషియా అందించింది. రెండేళ్లలో 23 మానవ ప్రమాద కేసులకు రూ.1.04 కోట్లు, 71 జంతు ప్రమాద కేసులకు రూ.20.20 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 1.24 కోట్ల రూపాయలకు పైగా ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
రెండు సంవత్సరాలలో
416 విద్యుత్ ప్రమాదాలు
ఫ 69 మంది బలి..
337 జంతువులు మృతి
ఫ వానాకాలం వస్తే నిత్యం
భయం గుప్పిట్లోనే..
ఫ రక్షణలేని ట్రాన్స్ఫార్మర్లే
మృత్యు కేంద్రాలు
ఫ బాధిత కుటుంబాలకు
ఎక్స్గ్రేషియా మంజూరులో
అధికారుల నిర్లక్ష్యం
జిల్లాలో 2024 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు మొత్తం 416 విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా 337 పశువులు, ఇతర జంతువులు విద్యుత్ షాక్కు బలయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 71 జంతువులకు సంబంధించిన వాటి యజమానులకు మాత్రమే ఎక్స్గ్రేషియా అందింది. ఇంకా 266 జంతువులకు సంబంధించిన వారికి పరిహారం అందలేదు.


