నల్లగొండ : చేయూత (ఆసరా) పెన్షన్ల ప్రక్షాళనకు అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. లైవ్నెస్ అథెంటికేషన్ ప్రక్రియలో ఇప్పటికే 204 మంది పెన్షన్దారులు మరణించినట్లు గుర్తించారు. వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం పెన్షన్లను అధికారికంగా తొలగించనున్నారు. అదే సమయంలో మిగిలిన అభ్యంతరాల కేసులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
మరణించిన వారిలో..
చేయూత పింఛన్ల ప్రక్షాళనలో భాగంగా 204 మంది మరణించినట్లు గుర్తించిన అధికారులు 55 మంది వివరాలు సేకరించలేకపోయినట్లు తెలిసింది. మరో 55 మందికి ఆధార్ సమస్యలు, 40 మంది ఆచూకీ లేనివారిగా, ఏడుగురు రాష్ట్రం వెలుపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కేవలం 8 మంది స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. మరణించిన వారి కుటుంబాలకు వెళ్లి ధ్రువీకరణ పూర్తిచేసిన తర్వాత వారి పెన్షన్లు రద్దు చేయనున్నారు. అయితే పెండింగ్ ఉన్న 165 కేసులపై విచారణ నిర్వహించి అనర్హులను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు.
అర్హులకే పింఛన్ అందేలా..
అర్హులైన వారికే చేయూత పింఛన్లు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నకిలీలు, అనర్హులను గుర్తించి పెన్షన్ జాబితాను ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని పెన్షన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఫ ఇప్పటికే 204 మంది
మృతుల గుర్తింపు
ఫ అనర్హుల తొలగింపునకు కార్యాచరణ
ఫ పెండింగ్ కేసులపైనా
క్షేత్రస్థాయిలో పరిశీలన


