మిర్యాలగూడ, వేములపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఉత్తమ బోధన అందించాలని డీఈఓ సుశీందర్రావు అన్నారు. శనివారం ఆయన మిర్యాలగూడలోని కేజీబీవీని, వేములిపల్లి జెడ్పీహెచ్ఎస్ను, ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయాచోట్ల తరగతి గదులను, భోజనశాలను, వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడంతోపాటు పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులకు ఎలాంటి లోటురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాన్ని సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు ధర్మానాయక్, లక్ష్మణ్నాయక్, ఎస్ఓ నాగమణి, జీహెచ్ఎం బూరుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.


