ఇప్పటికే మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తయినందున, ఆయా అధ్యక్షులంతా కూర్చొని మండల, పట్టణ కమిటీలకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సామాజికవర్గాల వారీగా కూర్పుతో పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారిని ఆయా కమిటీలలో నియమించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ సూచిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం పూర్తి కాగా ప్రస్తుతం జిల్లా పూర్తి స్థాయి కమిటీ నియామకంపై అధిష్టానం దృష్టి సారించింది. దీనికి సంబంధించి జిల్లాలోని మంత్రితోపాటు ఎమ్మెల్యేలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కై లాష్ నేత సంప్రదించి.. కమిటీలో చేర్చాల్సిన వారి పేర్లను సేకరించారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పంపించారు. కాగా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకత్వం దృష్టిసారించినా.. ప్రస్తుతానికి ప్రకటించే అవకాశం లేదని తెలిసింది.
సామాజిక న్యాయం ఆధారంగా కూర్పు!
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో సీనియారిటీ ఆధారంగా, సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేల అనుమతితో జిల్లా కార్యవర్గం జాబితా సిద్ధం చేశారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా కార్యవర్గంలో చోటు కల్పించడంతోపాటు, కష్టపడి పనిచేసిన సీనియర్లకు అవకాశం ఇవ్వాలన్నది పార్టీ ఉద్దేశం. కార్యవర్గం కూర్పుకోసం ఎమ్మెల్యేలతో జిల్లా పార్టీ అధ్యక్షుడు కై లాష్ సంప్రదింపులు జరిపి జాబితా సిద్ధం చేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్కు అందజేశారు.
జంబో కార్యవర్గమేనా..
డీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని వంద మందికి పైగా నాయకులతో నియమించనున్నట్లు తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి 15 మందికి తగ్గకుండా పేర్లను ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల ద్వారా జిల్లా అధ్యక్షుడు సేకరించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం తగ్గకుండా కమిటీలో అవకాశంకల్పించేలా జిల్లా కార్యవర్గాన్ని సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఒక అధికార ప్రతినిధి ఉండేలా జిల్లా కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది. జిల్లా కమిటీతోపాటు మండల, పట్టణ కమిటీల్లో చోటు కోసం పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పించాలని ఆశావాహులు కోరుతున్నారు. అయితే, అధిష్టానం నుంచి తుది ఆమోదం వచ్చిన వెంటనే జిల్లా పూర్తి స్థాయి కమిటీ ప్రకటించనున్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లా కమిటీ పేర్లు వెలువడే అవకాశం ఉంది.
ఫ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో డీసీసీ అధ్యక్షుడి సంప్రదింపులు
ఫ అధిష్టానానికి నివేదిక పంపిన జిల్లా అధ్యక్షుడు కై లాష్
ఫ జిల్లా కమిటీలో స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపు


