నల్లగొండ: సర్ ప్రక్రియలో భాగంగా సూపర్వైజర్లు, బీఎల్ఓలు తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియ ఇప్పటికే 98 శాతం పూర్తయిందని, మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ 86 శాతం పూర్తయిందన్నారు. పనితీరు సరిగా లేని బీఎల్ఓలకు అవగాహన కల్పించి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, హెల్ప్ డెస్క్లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల ఫొటోల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులు అవలంబించాలి
కట్టంగూర్ : పత్తి రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కపాస్ క్రాంతి పథకం కింద రైతులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పత్తి విత్తనాల ప్యాకెట్లను గురువారం కట్టంగూర్లోని రైతు వేదికలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఈ పథకంలో భాగంగా 19 ప్రముఖ కంపెనీలకు చెందిన లక్ష 65వేల పత్తి ప్యాకెట్లు జిల్లాలోని రైతు వేదికల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. విత్తనాలతో పాటు సస్యరక్షణ మందులైన వేపనూనె, సూక్ష్మ పోషకాలు, జీవ నియంత్రణ ఎరువులును రైతులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పత్తి సాగులో లోపాలను సవరిస్తూ ఎకరాకు కనీసం 750 కిలోల దిగుబడి సాధించే విధంగా నాణ్యమైన పత్తి విత్తనాల ప్యాకెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్నగర్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట నకిరేకల్ ఏడీఏ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్రెడ్డి, తహసీల్దార్ పుష్పలత, ఏఈఓ పరుశురాములు తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


