హాలియా : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అనుముల (హాలియా) మండలంలోని జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మధారిగూడెం, హాలియా మున్సిపాలిటీలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్ఓల పనితీరును పరిశీలించి మాట్లాడారు. ఓ ఇంటి యజమానితో మాట్లాడుతూ ఇంట్లో ఎంత మంది ఉంటారు, ఓటర్లు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వచ్చే బీఎల్ఓ, సూపర్వైజర్లకు ప్రజలు సహకరించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ చందర్రావు తదితరులు ఉన్నారు.
అందుబాటులో యూరియా
మిర్యాలగూడ : రైతులకు అవసరమైన సరిపడా యూరియా అందుబాటులో ఉందని డీఏఓ వల్లోజు వినోద్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మిర్యాలగూడలోని యూరి యా రేక్ పాయింట్, మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ను సందర్శించి యూరియా నిల్వలను పరిశీలించి మాట్లాడారు. మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ గోదాములో సుమారు 20 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఏడీఏ జగదీశ్వర్రెడ్డి, ఏఓ రుషేంద్రమణి తదితరులు ఉన్నారు.
నీలగిరి ఇన్చార్జి కమిషనర్గా అశోక్ కుమార్
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో మున్సిపల్ డీఈ అశోక్ కుమార్కు మంగళవారం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇంకా ఎవరికి అప్పగించలేదు. త్వరలో పూర్తిస్థాయి కమిషనర్ను నియమించే అవకాశం ఉంది.
ఇన్చార్జి ఎస్ఈగా శ్రీనివాసులు
నల్లగొండ : తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) నల్లగొండ ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) ఇన్చార్జిగా సూర్యాపేట డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) ఎ.శ్రీనివాసులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నల్లగొండ సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వర్లు జూన్ 30న పదవీ విరమణ చేశారు. దీంతో పాలనా అవసరాల దృష్ట్యా ఎ.శ్రీనివాసులును అడ్హాక్ ప్రాతిపదికన ఇన్చార్జ్ ఎస్ఈగా నియమించారు.
2న సీనియర్ బాలుర క్రికెట్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా సీనియర్ బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్టు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు ెహెచ్సీఏ ఆధ్వర్యంలో జరిగే సీ–డివిజన్ లీగ్ పోటీలో ఆడనుందని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ధ్రువపత్రాలతో పాటు సొంత క్రికెట్ కిట్టుతో సకాలంలో హాజరుకావాలని కోరారు.
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్తయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థుల ఈ నెల ఒకటి నుంచి మూడో తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 4న ఒరిజినల్ సర్టిఫికెట్తో హాజరుకావాలని కోరారు.


