నల్లగొండ : జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు బుధవారం నుంచి ఈనెల 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం నల్లగొండలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. తనిఖీల్లో గుర్తించిన బాల కార్మికులను వెంటనే విముక్తి చేసి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో పోలీసు శాఖతో పాటు మహిళా, శిశు సంక్షేమ, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ రవికుమార్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజలి, ఆపరేషన్ ముస్కాన్ బృందం సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


