కుట్రతోనే కేటీఆర్‌పై ఇ–ఫార్ములా కేసు | - | Sakshi
Sakshi News home page

కుట్రతోనే కేటీఆర్‌పై ఇ–ఫార్ములా కేసు

Nov 22 2025 7:42 AM | Updated on Nov 22 2025 7:42 AM

కుట్రతోనే కేటీఆర్‌పై ఇ–ఫార్ములా కేసు

కుట్రతోనే కేటీఆర్‌పై ఇ–ఫార్ములా కేసు

నకిరేకల్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ముఖం లేక కుట్రపూరితంగా కేటీఆర్‌పై ఇ–ఫార్ములా కేసు తీసుకువచ్చారని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ తగ్గుతోందనే కేటీఆర్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి నిజమైన కాంగ్రెస్‌ నాయకుడు కాదని.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసైగల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మంత్రులంతా సీఎం అవుతామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్‌ పార్టీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయరాని తప్పిదాలు చేసిందన్నారు. ఒక వైపు ఎంఐఎంతో, మరోవైపు బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించి రిగ్గింగ్‌ చేసి బీఆర్‌ఎస్‌కు ఓట్ల శాతం తగ్గించాలని ప్రయత్నించిందన్నారు. అయినా తమ పార్టీకి ఓట్ల శాతం తగ్గలేదన్నారు. మోదీ, అమిత్‌షాతో మాట్లాడుకుని, గవర్నర్‌తో ఒప్పందం చేసుకుని మళ్లీ ఇ–ఫార్ములా కేసును తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కేటీఆర్‌, హరీష్‌రావు మీద కేసులు పెట్టి అరెస్టులు చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా.. అక్రమ అరెస్టులు చేసినా.. బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెక్కచెదరరని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని విచారణ పేరుతో కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బీఆర్‌ఎస్‌ వీక్‌ అవుతుందని అనుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌ ఇమేజ్‌ పెంచడంలో కేటీఆర్‌ ఐటీ మంత్రిగా కృషి చేశాడని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్‌ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, ,మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్‌, రాచకొండ వెంకన్నగౌడ్‌, నాయకులు పెండెం సదానందం, వీరయ్య, పల్లె విజయ్‌, మల్లయ్య, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు.

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement