
మటి్ట గణపతికి జై..
కోదాడ: వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో ఈ సారి పర్యావరణహితంగా తయారుచేసిన మట్టి గణపతులను ప్రతిష్ఠించడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కోదాడ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు స్థానికంగా గత పది సంవత్సరాలుగా మట్టి గణపతులను తయారుచేస్తూ పర్యావరణ ప్రేమికుల మన్ననలు పొందుతున్నారు. గతంలో ఈ రెండు కుటుంబాల వారు వడ్రంగి పనిచేసేవారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు వర్కర్లను పెట్టుకుని పట్టణంలోని శ్రీనివాసనగర్, రాంమూర్తినగర్లో ఏర్పాటు చేసిన తయారీ కేంద్రాల్లో బంకమట్టి, పుట్టమన్నుతో ఒక అడుగు నుంచి 10 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసిన గంటలోపే పూర్తిగా కరిగిపోతాయని, నీటిలో ఉండే జలచరాలకు ఎలాంటి ముప్పు ఉండదని తయారీదారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి భక్తులు కోదాడకు వచ్చి ఈ మట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. విగ్రహాల ధరలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోల్చితే తక్కువగా ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు.
నాయకుల హడావుడి..
త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు యువతను ప్రసన్నం చేసుకోవడానికి వినాయక చవితిని ఉపయోగించుకుంటున్నారు. విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద వీరి హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. యువకులకు సొంత ఖర్చులతో విగ్రహాలను ఇప్పిస్తున్నారు. దీంతో తయారీదారులు ఈసారి విగ్రహాల రేట్లను పెంచారు. గతంలో కన్నా ఈసారి విగ్రహాలు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి
భక్తులు పర్యావరణహితంగా ఉండే మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి. గతంలో మట్టి విగ్రహాలు దొరికేవి కావు. ప్రస్తుతం తక్కువ ధరలో కావాల్సిన ఎత్తులో మట్టి విగ్రహాలు స్ధానికంగానే దొరుకుతున్నాయి. ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి. – కొల్లు లక్ష్మీనారాయణ,
పర్యావరణ ఉద్యమకారుడు
కోదాడలో మట్టి గణపతులు తయారుచేస్తున్న
రెండు కుటుంబాలు
ఆయా మండలాల
నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్న భక్తులు