
ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త కొండకింది చినవెంకట్రెడ్డి(99) మంగళవారం రాత్రి మృతిచెందారు. చినవెంకట్రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కొండకింది పూర్ణచందర్రెడ్డి హైదరాబాద్లో ప్రముఖ వైద్యుడు. చినవెంకట్రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులందరికీ సుపరిచితుడే. ఈయన స్వస్థలం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామం. రైతు కుటుంబంలో జన్మించిన చినవెంకట్రెడ్డి పుట్టిన తేదీ 1929 సెప్టెంబర్18 అని సర్టిఫికెట్లలో ఉండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన వయస్సు 99 సంవత్సరాలు అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చినవెంకట్రెడ్డి 1947లో ఎస్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు సేవలందించారు. ఆ తర్వాత హెచ్ఎంగా, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్గా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారు. సాహితీ మేఖల సంస్థకు జిల్లా గౌరవాధ్యక్షుడిగా చాలాకాలం కొనసాగి సంస్థ అభివృద్ధికి, సాహిత్యాభివద్ధికి కృషి చేశారు.
ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
చినవెంకట్రెడ్డి సతీమణి తారకమ్మ చాలా సంవత్సరాల క్రితమే మృతిచెందింది. ఆమె పేరు మీద కొండకింది తారకమ్మ చినవెంకట్రెడ్డి ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి ప్రతిభా స్కాలర్షిప్లను అందజేసి తోడ్పాటునందించారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషిచేస్తూనే బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లాస్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. పద్యాల పట్ల విద్యార్థుల్లో సన్నగిల్లుతున్న ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా 100 పద్యాలను కంఠస్థం చేసిన వారికి రూ.1,116, 200 పద్యాలు కంఠస్థం చేసిన వారికి రూ.2,116 నగదు బహుమతిని అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అదేవిధంగా గతంలో వరద బాధితుల సహాయార్ధం సుమారు రూ.10 లక్షల విలువైన దుస్తులు, బ్లాంకెట్లు, లుంగీలు, దోవతులు, చీరలు, షర్ట్స్, ప్యాంట్లు, టవల్స్, బనియన్లు, దుప్పట్లు అందజేశారు.
ప్రముఖుల నివాళి..
చినవెంకట్రెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రముఖులు నల్లగొండ పట్టణంలోని ఆయన నివాసానికి వచ్చి పార్ధివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, డీఐజీ మహేష్ భగవత్, ఏసీబీ డీజీ విజయ్కుమార్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆకుల రవి, అడిషనల్ ఎస్పీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్లు పురుషోత్తంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చొల్లేటి ప్రభాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మున్సిపల్ చైర్మన్లు పుల్లెంల వెంకట్నారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బండారు ప్రసాద్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, హాశం, పలువురు డాక్టర్లు, న్యాయవాదులు, లయన్స్క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు.
కలిసిరాని రాజకీయాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు గడించిన కొండకింది చినవెంకట్రెడ్డికి రాజకీయాలు కలిసి రాలేదు. 1984లో చినవెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఆయనకు నల్లగొండ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ద్వారా లభించగా.. చకిలం శ్రీనివాసరావు బీ ఫారం క్యాన్సిల్ చేయించడంతో అవకాశం చేజారిపోయింది. 1994లో అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డితో సన్నిహితంగా ఉండటం వలన ఆయన కోరిక మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి ఆర్గనైజింగ్ సెక్షన్లో పాలుపంచుకున్నారు. రాజకీయంగా ఏ పదవులను ఆశించలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త చినవెంకట్రెడ్డి కన్నుమూత