
పక్షులే ప్రాణంగా..
ఆయన ఇల్లంతా కిలకిలరావాలు
ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు పక్షుల కిలకిల రావాలు.. రామచిలుకల కిచకిచలు ఆహ్లాదం కలిగిస్తాయి. ఊర పిచ్చుకల సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది. పక్షి ప్రేమికుడైన ప్రదీప్ చిన్ననాటి హాబీ అయిన పక్షుల పెంపకమే నేడు ఫాం హౌస్గా మారింది. ప్రస్తుతం వివిధ దేశ విదేశాలకు చెందిన 500 రకాల పక్షులను ఇక్కడ సాకుతున్నాడు. తన లాంటి పక్షి ప్రేమికులకు వాటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాడు.
– నకిరేకల్
ఫ పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న ప్రదీప్
ఫ పక్షుల కోసం ప్రత్యేక ఫాంహౌస్ ఏర్పాటు
ఫ ఇక్కడ వివిధ రకాల 500 పక్షుల సంరక్షణ
ఫ విదేశీ రంగురంగుల పక్షులు సైతం లభ్యం
ఫ ఎక్కడ కొత్త రకం పక్షి కనిపించినా.. తెప్పించడమే పని
ఫ వాటి దాణాకే నెలకు రూ.15 వేలకుపైగా ఖర్చు
ఇతర దేశాల
పక్షులు కూడా..
ప్రదీప్ బాల్యం నుంచి పక్షుల పెంపకాన్ని హబీగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పక్షులను సంరక్షిస్తున్నాడు. ప్రస్తుతం షెడ్డులో పెద్దపెద్ద జాలీ బోన్లు ఏర్పాటు చేసి పక్షులను సాకుతున్నాడు. ఇప్పుడు సుమారు 50 నుంచి 100 రకాల పక్షులను 500పైగానే పెంచుతున్నాడు. విదేశీ పక్షులు ఎక్కువగా చైన్నె, బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాల్లో పెంచుతారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుకున్న ప్రదీప్ వాటిని ఇక్కడికి తెప్పిస్తున్నాడు. దేశంలో ఎక్కడ డిఫెరెంట్ పక్షులు కనిపించినా వాటిని తెచ్చుకుని సంరక్షించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ మనకు మాట్లాడే రామచిలుకలు, పావురాలు, ఇతర రకాల అందమైన పక్షుల కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే ఒక్కో పక్షి రూ.600 నుంచి రూ.60 వేల పైనే ధర పలుకుతాయి. పక్షుల జీవిత కాలం ఏడాదిన్నర నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది.
నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన రాపోలు లింగయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు. నకిరేకల్లోని మూసీ రోడ్డులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన కుమారుడు రాపోలు ప్రదీప్కు చిన్నతనం నుంచి పక్షులంటే ఎనలేని ప్రేమ. ప్రదీప్ 17 ఏళ్ల క్రితం నుంచి మూసీ రోడ్డులోని తన ఇంట్లో 100 పక్షులతో పెంపకాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏడేళ్ల క్రితం నకిరేకల్లోని చీమలగడ్డలో 500 గజాల స్థలంలో రూ.10 లక్షల వ్యయంతో రేకుల షెడ్లు వేసి పక్షుల ఫాంహౌస్ ఏర్పాటు చేశాడు. ఆ పరిసర ప్రాంతమంతా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాడు. షెడ్డుపైన జమ్ము వేసి.. స్ప్రింక్లర్ల ద్వారా నిరంతరం నీటితో తడుపుతూ ఎండ నుంచి పక్షులకు రక్షణ కల్పిస్తున్నాడు. ఫాం హౌస్లో పక్షుల సంరక్షణే ఆయన దిన చర్చ. పనిమీద ఎక్కడికై నా వెళ్లినా.. సాయంత్రానికి ఫాంహౌస్ చేరుకుని వాటిని సంరక్షిస్తుంటాడు.
500 పక్షులు పెంచుతున్నా
చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగాను. అప్పటి నుంచే నాకు పక్షులంటే ప్రాణం. చిన్నతనంలో కనిపించిన ఒకటి రెండు పక్షులను తెచ్చుకున్నాను. ఆ తరువాత పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్నాను. ఇప్పుడు 500 పక్షుల వరకు పెంచుతున్నాను. పక్షులు అవసరమైన వారికి వస్తే లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా సాయంత్రంలోగా పక్షుల ఫాం హౌస్కు చేరుకుంటాను. చిన్న పిల్లల మాదిరిగా వాటిని సంరక్షిస్తాను.
– రాపోలు ప్రదీప్,పక్షి ప్రేమికుడు, నకిరేకల్
హైదరాబాద్, గుజరాత్ నుంచి దాణా
ప్రదీప్ తన పక్షుల కోసం ప్రతి నెలా రూ.15 వేలపైనే దాణా కోసం ఖర్చు చేస్తున్నారు. సూర్యాపేట, హైదరాబాద్, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాల నుంచి దాణా తెప్పిస్తున్నాడు. వాటికి కొర్రలు, రాగులు, వేరుశనగ, పెసర్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ తదితర పదార్థాలను ఆహారంగా ఇస్తున్నాడు. పశు వైద్యుల సలహాలు తీసుకోవడంతోపాటు పక్షులకు వైద్యం చేయిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు.

పక్షులే ప్రాణంగా..

పక్షులే ప్రాణంగా..

పక్షులే ప్రాణంగా..

పక్షులే ప్రాణంగా..

పక్షులే ప్రాణంగా..

పక్షులే ప్రాణంగా..

పక్షులే ప్రాణంగా..