తొలితరం కవి రావిరాల బుచ్చయ్య మృతి | - | Sakshi
Sakshi News home page

తొలితరం కవి రావిరాల బుచ్చయ్య మృతి

Mar 10 2025 10:20 AM | Updated on Mar 10 2025 10:21 AM

చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన తొలితరం కవి, రచయిత రావిరాల బుచ్చయ్య(75) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన ఆర్టీసీ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. గతంలో విరసం ఆవిర్భావ సభ్యుడిగా, ఆ సంఘం నల్లగొండ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 1964లో ‘సిందు రామవ్వ’ నవలను, 1977లో ‘విముక్తి పథం’ అనే గ్రంథంతో పాటు అనేక కవితలు, కథలు, పలు రచనలు రాశారు. అంతేకాకుండా ఆయన టీవీ ఆర్టిస్టుగా, నాటకకర్తగా ఉన్నారు. ఆయన మృతి పట్ల సృజన సాహితి అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్‌, డాక్టర్‌ సాగర్ల సత్తయ్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్‌, కవులు, రచయితలు డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య, దర్శనం అంజయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, వట్టిమర్తి గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నర్రా లవేందర్‌రెడ్డి, బూరుగు రమేష్‌ సంతాపం తెలిపారు.

ఉరివేసుకుని

యువకుడి ఆత్మహత్య

భూదాన్‌పోచంపల్లి: మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెం గ్రామానికి చెందిన బుగ్గ ప్రవీణ్‌ (25) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మృతుడి తల్లిదండ్రులు తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి వెళ్లారు. ప్రవీణ్‌ ఉదయం పొలంవద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఒంటరికి ఉన్న ప్రవీణ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన అతడి అన్న ప్రభాకర్‌ ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రవీణ్‌ ఉరివేసుకుని కనిపించాడు. కాగా.. ప్రవీణ్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికంది వచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

యాదగిరి క్షేత్రంతో

గరిమెళ్లకు అనుబంధం

యాదగిరిగుట్ట: టీటీడీ ఆస్థాన సంగీత విధ్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ తిరుపతిలోని ఆయన నివాసంలో ఆదివారం మృతి చెందారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఇటీవల పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను తన బృందంతో ఆలపించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించారని పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను గుర్తు చేసుకున్నారు.

అంతుచిక్కని వ్యాధితో

గేదె మృతి

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని మామిళ్లగూడెం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో గేదెలు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం పర్సమోని అనసూయకు చెందిన గేదె తలను నేలకు బాదుకుని మృతి చెందింది. అంతేకాక పర్సమోని కమలమ్మ, బొడ్డు ఎల్లమ్మకు చెందిన గెదేలు సైతం వ్యాధిసోకి వింతగా ప్రవర్తిస్తున్నాయని బాధితులు తెలిపారు. గేదెలు తలను నేలకు గట్టిగా గుద్దుకొంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు. వారం రోజులుగా గడ్డిమేయడంలేదని, పగలు, రాత్రివేళల్లో నిద్రపోవడంలేదని చెబుతున్నారు. పశువైద్యాఽధికారులను సంప్రదించగా.. వారు మందులు ఇచ్చినా తగ్గడం లేదని వాపోయారు. ఇలా అంతుచిక్కని వ్యాధితో గేదెలు మృతి చెందుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.

తొలితరం కవి రావిరాల బుచ్చయ్య మృతి1
1/1

తొలితరం కవి రావిరాల బుచ్చయ్య మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement