
అష్టోత్తర పూజలు చేస్తున్న అర్చకులు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన ఆచార్యులు.. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం అర్చన, అభిషేకం చేశారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.