
మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి
పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్లో నీరు అడుగంటడంతో.. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ మోటార్లను బుధవారం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. జంట నగరాల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో పది మోటార్లను బిగిస్తున్నారు. 120 క్యూసెక్కుల సామర్థ్యమున్న మోటార్లు ఐదు, 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న ఐదు మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. బుధవారం 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ నిర్వహించామని, మరో రెండు రోజుల్లో పది మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు డీఈ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.
భువనగిరి గడ్డపై
ఎర్రజెండా ఎగరాలి
నకిరేకల్ : తెలంగాణలో సీపీఎం పోటీ చేస్తున్న భువనగిరి గడ్డపై ఎర్రజెండా ఎగరాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నకిరేకల్లోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు మోదీ ప్రకటించిన మేనిఫెస్టో ఒక రకంగా ఉంటుందని.. అధికారంలోకి వచ్చాక మరోలా ఉంటుందని విమర్శించారు. ఈనెల 19 సీపీఎం ఎంపీ అభ్యర్థి జంహగీర్ భువనగిరిలో నామినేషన్ దాఖలు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు తుమ్మల వీరారెడ్డి, కందాల ప్రమీల, బొజ్జ సుందర్, రాచకొండ వెంకట్గౌడ్, వంటెపాక వెంకటేశ్వర్లు, కృష్ణ, ఏర్పుల తాజ్వేశర్ పాల్గొన్నారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
త్రిపురారం : విద్యార్థులు పట్టుదల, అంకితభావంతో వ్యవసాయ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల డైరెక్టర్ జమునారాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పాలిటెక్నిక్ విశ్వ విద్యాలయంలో 8వ వార్షిక వేడుకలను వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు నాలెడ్జ్ స్కిల్ను ఉపయోగించుకుంటూ సొంత లక్ష్యాలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆటలు, అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కంపాసాగర్ వ్యవసాయ పరశోధన స్థానం హెడ్ డాక్టర్ లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం డైరెక్టర్ డాక్టర్ మల్లారెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు, సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్, మోటివేషనల్ స్పీకర్ సుదర్శన్, స్వాతి, శేఖర్ రెడ్డి, నర్సింగ్ రావు, పరుశురాం, డాక్టర్ శ్రీదర్, డాక్టర్ శివ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరులో
44.8 డిగ్రీల ఉష్ణోగ్రత
నిడమనూరు : నిడమనూరులో బుధవారం రికార్డ్ స్థాయిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు నిడమనూరులో రెండుసార్లు అత్యదిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. బుధవారం మూడోసారి నమోదైంది.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న డైరెక్టర్ జమునా రాణి

అప్రోచ్ కెనాల్కు వస్తున్న నీరు