గణపయ్య నిమజ్జనానికి సవాళ్లు
రాజోళి: విఘ్నాధిపతి.. తొలిపూజలు స్వీకరించే నాథుడు.. గణపయ్యకు చవితి పూజలను ప్రజలు ఘనంగానే నిర్వహించారు. స్వామి రాకను కాంక్షిస్తూ.. ఊరేగింపుగా అంగరంగ వైభవంగా కొలువుదీర్చారు. శక్తి మేరకు కొలిచిన భక్తజనులకు గణపయ్యను నిమజ్జనం పంపడం పెద్ద సమస్యగా మారింది. గతంలో వినాయక నిమజ్జనం అంటే స్థానికంగా చెరువులు, వాగులు, నదుల్లో పుష్కలంగా నీరు ఉండేది. కానీ, ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాల జాడే లేకపోవడంతో చెరువులు, కుంటలు, వాగులు నీటి జాడే లేకపోగా.. జీవనదులు కృష్ణా, తుంగభద్ర సైతం ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. దీంతో గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడం ఎలా అన్న ప్రశ్న నిర్వాహకులను కలవరపెడుతోంది. కాగా.. అధికారులు మాత్రం జిల్లాలోని బీచుపల్లి వద్దే పెద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అడుగంటిన తుంగభద్ర..
జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉండగా.. వీటి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎన్నో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటాయి. అయితే ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తుంగభద్ర, కృష్ణానదులకే వస్తారు. ఏటా బీచుపల్లి వద్ద వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది ఎల్నినో కారణంగా వర్షాలు కురవని కారణంగా నదిలో నీరు లేకపోవడంతో నిమజ్జనంకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా బేసిన్లో కురిసిన అరకొర వర్షాలతో వస్తున్న వరదతో జిల్లా పరిధిలోని కృష్ణానదిలో కొద్ది మేర నీరు ఉండగా.. తుంగభద్ర నదిలో మాత్రం పూర్తిగా ఒట్టిపోయింది. ప్రధానంగా నిమజ్జనం చేసే ప్రదేశాల్లో కూడా వినాయక విగ్రహాలు నీటిలో మునిగే స్థాయిలో కూడా నీరు లేకపోవడం గమనార్హం.
వర్షాభావ పరిస్థితులతో చెరువుల్లో కానరాని నీటి జాడ
నడిగడ్డలో ఎండుదశకు చేరుకున్న
రెండు జీవనదులు
నెర్రెలు బారి 10 అడుగుల కనిష్టానికి నీటిమట్టం
అయినప్పటికీ కృష్ణానదికే తరలింపు?


