కొల్లాపూర్ రూరల్: ప్రకృతి సంపదకు ఎలాంటి హాని కలగకుండా పర్యాటకాభివృద్ధి చేపట్టాలని.. అటవీ సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వు నూతన ఫీల్డ్ డైరెక్టర్ ఎస్వీ ప్రసాద్ అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని సోమశిల ఎకో పార్కును పరిశీలించారు. కృష్ణానది అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొల్లాపూర్లో అటవీశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అడవులను కొట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేంజర్ వాణికుమారిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూ టీ రేంజ్ అధికారులు కాశన్న, ముజీబ్ ఘోరీ, బయన్న, నీలేష్ మతీన్, దినేష్ ఉన్నారు.


