● కమర్షియల్కు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా చర్యలు
● కలెక్టర్ బదావత్ సంతోష్
కందనూలు: జిల్లాలో గృహ అవసరాలకు వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. గృహ వినియోగదారులకు అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ, సాగు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 2,50,277 ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల సమస్య లేదన్నారు. రానున్న రోజుల్లోనూ ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమర్షియల్ వినియోగానికి డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా 4,11,002 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు సాగుచేశారని.. పంటలకు అవసరమైన సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్లో 72.4928 టీఎంసీల నీటినిల్వ ఉందన్నారు. రానున్న వేసవిలో తాగు, సాగునీటికి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి త్వరలో కోతలు ప్రారంభమవుతాయని.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.


