
పూలే, అంబేడ్కర్ ఆధునిక భారత నిర్మాతలు
కల్వకుర్తి రూరల్: మహాత్మ జ్యోతిబాపూలే, బీఆర్ అంబేడ్కర్ మన ఆధునిక భారత నిర్మాతలు అని, వారు చూపిన మార్గంలో నడుద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు అన్నారు. శనివారం కల్వకుర్తిలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ‘పూలే, అంబేడ్కర్ ఆలోచనలు– సమకాలీన పరిస్థితులు’ అనే అంశంపై కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పరశురాములు అధ్యక్షతననిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిద్దరూ ఆధునిక భారత నిర్మాతలు అనే విషయాన్ని నేటితరం మర్చిపోతుందన్నారు. పూలే దంపతులు అందరికీ విద్య కోసం తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. మహిళా సమానత్వం కోసం నాటి ఆటవిక సమాజాన్ని నాగరిక సమాజంగా మార్చారన్నారు. సత్యశోధన జంగ్ సమాజం స్థాపించి సామాజిక సేవలు విస్తృతంగా నిర్వహించారన్నారు. అంబేడ్కర్ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే భావిస్తూ ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారని చెప్పారు. భూమి జాతీయీకరణ జరగాలని, పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని ఆనాడే ఆయన రాష్ట్రాలు– మైనార్టీలు అనే పుస్తకంలో ప్రస్తావించారని చెప్పారు. మహిళల సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి నాటి ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. కుల వివక్ష, అంటరానితనంపై పూలే, అంబేడ్కర్ అడుగు జాడల్లో ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నట్లు స్కైలాబ్బాబు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిన్నయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశన్న, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, స్వాతి, బాలామణి తదితరులు పాల్గొన్నారు.