
‘పంచాయతీ’లో అక్రమాలు..
‘గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను మండల స్థాయి పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఇందులో భాగంగా వాహనాల అలెవెన్స్ కోసం పంచాయతీల నుంచి నిధులు వాడుకోవచ్చని 2022లో జిల్లా ఉన్నతాధికారులు ఒక సర్క్యులర్ జారీచేశారు. తర్వాత ఐదు నెలలకే ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే ఇదే అదునుగా భావించిన ఓ అధికారి.. ఉత్తర్వులు రద్దు అయినప్పటికీ ఏకంగా 15 నెలలపాటు వివిధ గ్రామ పంచాయతీల నిధుల నుంచి సొంత ఖాతాకు మళ్లించాడు. ఒక్కో జీపీ నుంచి రూ.20 వేల చొప్పున సదరు పంచాయతీ అధికారి రూ.లక్షల్లో నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.’
‘తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నిధుల్లో నుంచి రూ.30 వేల చొప్పున సదరు పంచాయతీ అధికారి వ్యక్తిగత ఖాతాలోకి మళ్లాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన చివరి రోజున హడావుడిగా మిగులు నిధులను సొంత ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం. ఇదే మండలం పెద్దూర్ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్ల జీతాల పేరుతో రూ.17 వేల చొప్పున అధికారి సొంత ఖాతాలోకి బదిలీ అయ్యాయి.
● జీపీ నిధులు సొంత ఖాతాకు బదిలీ చేసుకున్న మండలస్థాయి అధికారి
● మల్టీపర్పస్ వర్కర్ల జీతాల
పేరుతో పక్కదారి
● వాహనాల అలవెన్స్
పేరిట దుర్వినియోగం
● మరో చోటుకి బదిలీ చేసినా పలుకుబడితో
పూర్వస్థానానికే డిప్యుటేషన్
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో అక్రమాల పరంపర కొనసాగుతోంది. పంచాయతీ నిధులను ఆయా గ్రామా ల అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించాల్సి ఉండగా, కొందరు వాటిని పక్కదారి పట్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఉదాసీనత వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.
సొంత ఖాతాల్లోకి నిధులు..
జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల నిధులను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, హరితహారం, పల్లె ప్రగతి నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం ఆయా మండలాల పంచాయతీ అధికారులకు అప్పగించింది. ఇందుకోసం వాహనాలను వినియోగిస్తే వాటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి నెలకు రూ.20 వేల చొప్పున వాహన అలవెన్సు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కేవలం ఆరునెలల పాటే కొనసాగించిన అధికారులు తర్వాత దానిని రద్దు చేశారు. అయినా ఉన్నతాధికారుల కళ్లుగప్పి మరో ఏడాదిపాటు వాహనాల అలవెన్సు పేరుతో ఆయా గ్రామాల నుంచి నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఆయా గ్రామాల మల్టీ పర్పస్ వర్కర్లకు వారి ఖాతాల్లోకే జీతాలను బదిలీ చేయాల్సి ఉండగా, వారితోపాటు అదనంగా మండలస్థాయి పంచాయతీ అధికారి తన వ్యక్తిగత ఖాతాలోకి జీతాలను మళ్లించడం ఈ శాఖలో కొనసాగుతున్న అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
డిప్యుటేషన్తో పాగా..
నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సదరు మండలస్థాయి పంచాయతీ అధికారి ఒకే మండలంలో ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. గతేడాది సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన్ను కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఓ మండలానికి బదిలీ చేసింది. అయితే ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలలు గడవక ముందే సదరు అధికారి చక్రం తిప్పాడు. తనకున్న పలుకుబడితో ‘ప్రత్యేక’ డిప్యుటేషన్ పేరుతో మళ్లీ పూర్వస్థానానికే వచ్చి చేరాడు. రాజకీయ నేత లు, ఉన్నతాధికారుల సహకారంతోనే అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. అక్రమాలపై ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సమగ్ర విచారణ చేపడతాం..
గ్రామ పంచాయతీ నిధులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్టుగా ఓ అధికారిపై మాకు ఫిర్యాదు అందింది. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – రామ్మోహన్రావు, డీపీఓ
●

‘పంచాయతీ’లో అక్రమాలు..

‘పంచాయతీ’లో అక్రమాలు..

‘పంచాయతీ’లో అక్రమాలు..