● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత
ఏటూరునాగారం: సర్పంచ్లు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, సేవల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్లైన్–1098, జిల్లా హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వంటి విభాగాల ద్వారా మహిళలు, బాలికలు, పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు ఎదుర్కొనే గృహహింస, వేధింపులు, అత్యాచారం వంటి సమస్యలపై సఖి కేంద్రం ద్వారా అందించే వైద్యం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను సర్పంచ్లు గుర్తుంచుకొని కావాల్సిన వారికి సాయం చేయాలన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న లేదా సహాయం అవసరమైన పిల్లల కోసం చైల్డ్ హెల్ప్లైన్ 1098 ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా డీహెచ్ఈడబ్ల్యూ ద్వారా మహిళల సాధికారత, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తదితర అంశాలపై సర్పంచ్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈ పురుషోత్తం, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీవిద్య, వసంత, బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజు, సఖి కౌన్సిలర్ కల్పన, చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


