లెక్క చెప్పాల్సిందే..
ములుగు: సర్పంచ్గా గెలిచినా.. ఓడినా ఎన్నికల ప్రచార ఖర్చును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరిగిన 45 రోజుల్లోగా ప్రచార ఖర్చుల వివరాలు సమర్పించని సర్పంచ్లపై ప్రభుత్వం అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. గత డిసెంబర్ నెలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 146 గ్రామపంచాయతీలు ఉండగా, 11న తొలి విడతలో 48 జీపీలకు, 14న రెండవ విడతలో 52 జీపీలకు, 17న మూడవ విడతలో 46 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 146 గ్రామ పంచాయతీలకు 25 ఏకగ్రీవం కాగా మిగిలిన 121 పంచాయతీలకు 435 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేశారు. 314 మంది అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించగా 121 మంది అభ్యర్థులు ఇంకా ప్రచార ఖర్చుల వివరాలు సమర్పించలేదు.
మొదటి విడత అభ్యర్థులకు నేడే చివరిరోజు
జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలు ఉండగా మంగపేట మండలంలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో కేసు ఉండడంతో 25 జీపీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 9 మండలాల పరిధిలో 146 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పరిధిలో 48 జీపీలు ఉండగా 9 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 39 పంచాయతీలకు 148 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేశారు. ఇందులో 128 ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించగా, మిగిలిన 20 మంది అభ్యర్థులు శనివారం లోగా అధికారులకు సమర్పించాలి. 2వ విడతలో వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల పరిధిలో 46 జీపీలు ఉండగా ఒక జీపీ ఏకగ్రీవం అయింది. మిగిలిన 45 జీపీలకు 158 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 88 మంది ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు అందించారు. మిగిలిన 70 మంది ఈనెల 27లోగా ఖర్చుల వివరాలు అధికారులకు అందించాలి. మూడవ విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) పరిధిలో 52 పంచాయతీలు ఉండగా 15 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 37 పంచాయతీలకు 129 మంది పోటీ చేయగా 98 మంది ఎన్నికల ఖర్చు వివరాలను అందించారు. మిగిలిన 31 మంది ఈనెల 30లోగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం తమ ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గడువులోగా సమర్పించాలి. సర్పంచ్గా గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించకపోతే ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఖర్చు వివరాలు సమర్పించకపోతే మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు.
– వెంకయ్య, డీపీఓ
లెక్క చూపని సర్పంచ్ అభ్యర్థులపై అనర్హత వేటు
జిల్లాలో 146 జీపీల పరిధిలో 435 మంది అభ్యర్థులు పోటీ
ప్రచార ఖర్చుల వివరాలు సమర్పించిన 314 మంది అభ్యర్థులు
లెక్కలు చూపాల్సిన వారు 121 మంది..
లెక్క చెప్పాల్సిందే..
లెక్క చెప్పాల్సిందే..


