పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
ములుగు రూరల్: పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పందికుంట గ్రామంలో ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమం మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్యాదవ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. అంత్యోదయ పథకంతో ప్రతీ పేదవాడికి ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త సురేందర్, రాయకంటి పరమేశ్వర్, బైకాని మహేందర్, గొర్రె మహేందర్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.