మరో చిన్నారి కారు స్టార్ట్ చేయడంతో ప్రమాదం
హైదరాబాద్: వరంగల్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఓ బాలుడిని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో మృతి చెందాడు. నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ తెలిపిన మేరకు.. అమీర్పేటకు చెందిన అలిమేకల పురుషోత్తం కుటుంబంతో కలిసి శుక్రవారం మేడారానికి వెళ్లి ఎంఎస్ఆర్ గదిలో దిగారు.
చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్ కుటుంబం కూడా పక్కగదిలో దిగింది. ఈ క్రమంలో అరుణ్ నాలుగేళ్ల కుమారుడు తండ్రి వద్ద ఉన్న కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఆ సమయంలో గది ముందు ఆడుకుంటున్న కౌశిక్ (7)పైకి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం కంటతడి పెట్టించింది. మరోవైపు, ప్రమాదానికి కారణమైన చిన్నారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు.


