గట్టమ్మ తల్లికి మంత్రి పూజలు

- - Sakshi

ములుగు రూరల్‌: మండలంలోని జాకారం గ్రామ పంచాయతీ పరిధి గట్టమ్మ తల్లికి రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటనకు బయలుదేరిన మంత్రి గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, జెడ్పీటీసీ సకినాల భవాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌, సర్పంచ్‌ దాసరి రమేష్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్‌రాంనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

జీవాలకు నట్టల నివారణ మందు వేసుకోవాలి

ములుగు రూరల్‌: గొర్లు, మేకలకు మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నట్టల నివారణ మందులు వేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్‌భాస్కర్‌ సూచించారు. గురువారం మండలంలోని బరిగలానిపల్లిలో గొర్రెల పెంపకందారులకు నట్టల మందు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారణ మందులు తాగించడం వల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో పెంపకందారులకు లాభసాటిగా ఉంటుందని అన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గరిగె లతనర్సింగరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కర్ణాకర్‌, వైద్యులు నర్సింహ, నవత, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది జవహర్‌, లక్ష్మీబాయి, రైతులు పాల్గొన్నారు.

గోదావరిలో

పారిశుద్ధ్య పనులు

కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో బ్యాక్‌వాటర్‌ నీరు తగ్గుతుండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి బయటికి తేలుతుంది. దీంతో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కార్మికులు చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ దుర్వాసన రాకుండా సర్పంచ్‌ వసంత, కార్యదర్శి సత్యనారాయణ బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌కు వినతి

భూపాలపల్లి రూరల్‌: డిగ్రీ, పీజీ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కాకతీయ యూనివర్శిటీ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అధ్యక్షుడు గుర్రపు రవీందర్‌ గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు జిల్లాకేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రవీందర్‌ తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాంమూర్తి, జిల్లా జూనియర్‌ కళాశాలల అధ్యక్షుడు బిల్లా రాజిరెడ్డి, తేజస్వినీ జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

దామెరకుంట ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా చంద్రశేఖర్‌

కాటారం: కాటారం మండలం దామెరకుంట ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా ఉపసర్పంచ్‌ చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు. సర్పంచ్‌ రఘువీర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల కలెక్టర్‌ తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు.

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top