
చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇక సోషియో ఫ్యాంటసీ జానర్లో రూపొందుతోన్న ‘విశ్వంభర’ కథపై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి.
తాజాగా ఆ గాసిప్స్కి చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేశారు డైరెక్టర్ వశిష్ఠ. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం... అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం.
ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి, తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ. రెండు రోజుల ప్యాచ్ వర్క్తో పాటు ఓ ప్రత్యేక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 25న మొదలయ్యే చిత్రీకరణతో వీటిని పూర్తి చేస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని పేర్కొన్నారు. ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్కి ఎంతో ప్రాధాన్యం ఉందట. అందుకే ప్రపంచస్థాయి కంపెనీలతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయిస్తున్నారు మేకర్స్.