
బాలీవుడ్ సీనియర్ నటుడు మహేశ్ మంజ్రేకర్ ప్రస్తుతం సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మూవీ అదుర్స్లో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో తనదైన నటన, కామెడీతో అలరించారు. బాలీవుడ్లోనూ పలువు సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం మరాఠీ చిత్రంలో నటిస్తున్నారు. 'దేవ్మనుస్' అనే మరాఠీ చిత్రంలో కనిపించనున్నారు. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారాయన. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ మంజ్రేకర్ సినిమా కంటెంట్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్న సినిమాల్లో కంటెంట్ పరంగా చూస్తే కేవలం మరాఠీ, మలయాళ ఇండస్ట్రీలు మాత్రమే సరైన కంటెంట్ను అందిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిగిలిన ఇండస్ట్రీలన్నీ సినిమా అంటే కమర్షియల్ కోణంలోనే చూస్తున్నాయని తెలిపారు. మరాఠీ సినిమాలో కథలు బాగున్నప్పటికీ.. పోటీ, స్థాయి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతోందని అన్నారు.
మరాఠీ చిత్రాలను వారి సొంత రాష్ట్రంలో కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర వందశాతం హిందీని అర్థం చేసుకోవడం కూడా ఇక్కడ అతిపెద్ద సమస్య అని వెల్లడించారు. దీని వల్ల ప్రేక్షకులు భారీ బడ్జెట్ హిందీ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారని వివరించారు. మలయాళం, మరాఠీ సినీ పరిశ్రమలు అర్ధవంతమైన కంటెంట్కు ప్రాధాన్యతనిస్తున్నాయని వెల్లడించారు.
దక్షిణ భారత సినిమాల విషయానికొస్తే.. వారి ప్రేక్షకులు భారీగా ఉంటారని.. అందువల్లే వారి కలెక్షన్లు భారీగా ఉంటాయని మహేశ్ అన్నారు. అందుకే వారు హిందీ సినిమాతో సమానంగా.. భారీ బడ్జెట్ సినిమాను నిర్మించగలరని అన్నారు. అందువల్ల వారి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయని తెలిపారు. మరాఠీ సినిమా కూడా అదే స్థాయికి చేరుకుని పాన్ ఇండియాలో విడుదల చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరాఠీలో ఎక్కువ సినిమాలు రావడం కంటే.. నాణ్యమైన చిత్రాలు వస్తే మరింత బాగుంటుందని అన్నారు. మారుతున్న ప్రేక్షకుల ప్రాధాన్యతలను బాలీవుడ్ చిత్రాలే కాదు.. సౌత్ సినిమాలు కూడా గుర్తించడం లేదన్నారు. ప్రభాస్ చివరిగా వచ్చిన సినిమా అది అస్సలు పని చేయలేదు. నేను ప్రభాస్, శ్రద్ధా కపూర్లతో చేసిన సాహో మూవీ కూడా హిట్ కాలేదని గుర్తు చేసుకున్నారు.
పాన్-ఇండియా సినిమాలు విజయం సాధించడానికి గల కారణాలను మహేశ్ మంజ్రేకర్ వివరించారు. దక్షిణ భారత చిత్రాలన్నీ పాన్-ఇండియాగా వస్తున్నాయని.. నేను అదే ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. గత పదేళ్లలో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే తీశారని గుర్తు చేశారు. అంటే ఏడాదికి ఒక్క సినిమా కూడా కాదు. అందులో మూడు కన్నడ, కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పుష్ప-1, పుష్ప-2, కాంతార, ఆర్ఆర్ఆర్ అని వెల్లడించారు. మరాఠీ సినిమాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ హిందీ, తమిళం, తెలుగు, కర్ణాటక, బెంగాలీ, పంజాబీల చిత్రాల నుంచి పోటీని ఎదుర్కొంటుందని మహేశ్ మంజ్రేకర్ అన్నారు. కానీ మేము దాని నుండి బయటపడతామమని ధీమా వ్యక్తం చేస్తున్నారు..