బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇండియన్ మూవీలో నటిస్తోంది. మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది.
తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ముద్దుగుమ్మ తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కేవలం ఒక్క క్షణంలోనే సినిమా చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమందిని మెప్పించలేకపోయాననే కారణంతో తనను సినిమా నుంచి తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని ప్రియాంక తెలిపింది.
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను వాళ్లతో ఏకీభవించలేదని.. నన్ను సినిమాల నుంచి తీసేశారు. 2007లో ఓ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. సలామ్-ఎ-ఇష్క్ షూటింగ్ సమయంలో మరో సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సమయంలో హీరో ఒకరోజు నా సెట్కు వచ్చారు. తర్వాత నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసి నాకు మద్దతుగా వచ్చాడని అనుకున్నా. కానీ ఆయన ఊహించని మాట చెప్పారు. దర్శకుడు పొరపాటున నిన్ను సెలెక్ట్ చేశారు. నిజానికి ఈ రోల్ మరో హీరోయిన్ చేయాల్సింది. మనం భవిష్యత్తులో మరో సినిమా చేద్దాం. ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చా’ అని చెప్పారని గుర్తు చేసుకుంది. అంతేకాకుండా కొందరు అగ్ర హీరోలు నన్ను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది.


