Telugu Film Chamber: వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు!
ఇండస్ట్రీలో నెలకొన్న వివిధ సమస్యల కారణంగా ఈ నెల 1నుంచి తెలుగు సినిమాల చిత్రీకరణలను నిలిపి వేస్తున్నట్లుగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు చెబుతున్న సమస్యల్లో వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) చార్జీలు కూడా ఒక ప్రధానాంశం. ఈ సమస్య పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫిలిం ఎగ్జిబిటర్స్ హైదరాబాద్లోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశం అయ్యారు.
‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, వారికి చెల్లించనున్న వీపీఎఫ్పై సుదీర్ఘంగా చర్చించుకున్నాం. చర్చలు ఆశాజనకంగా జరిగాయి. కొత్త వీపీఎఫ్ చార్జీలు వచ్చే నెల 1 నుంచి అమలయ్యే విధంగా కృషి చేస్తాం’’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కానూరి దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి అనుపమ్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.