‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే మాట చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో ఈ మాటని ఇంకాస్త ఎక్కువగా వాడుతుంటారు. హీరోయిన్ తమన్నా కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. ‘‘నటీనటులకు దూరదృష్టి అవసరం. లేదంటే మనకంటూ చివరకు ఏమీ మిగలదు?’’ అని చెబుతున్నారామె.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నగారే చూసుకునేవారు. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నేర్పించడంతోపాటు మార్గనిర్దేశం చేశారు.ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్, నగల వ్యాపారాలతోపాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. భవిష్యత్తులో అవే నాకు ఉపయోగపడతాయి. ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఒకరి తలరాత మారిపోతూ ఉంటుంది.
అందుకే అవకాశాలు ఉన్నప్పుడే సంపాదించిన డబ్బును సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి. గ్లామర్ ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలి. లేదంటే చివరకు ఏమీ మిగలదు. కెరీర్ ముగిశాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు తమన్నా. ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, రేంజర్, ఐపీఎస్ మారియా, వి. శాంతారామ్, రాగిణి 3, నో ఎంట్రీ 2, బోలే చూడియా’ వంటి హిందీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.


